Description
కథల ప్రపంచం-2
ఈ పుస్తకంలో రెండు కథలు ఉన్నాయి. మొదటి కథ “అతిలోక సుందరి”. ఇది ఎస్టోనియన్ జానపద కథ; రెండవ కథ “పిల్లి, కుక్క, పులిగా మారిన ఎలుక”. ఇది భారతీయ జానపద కథ.
మొదటి కథ ముగ్గురు అన్నదమ్ముల కథ. అన్నలిద్దరి కంటే ఆఖరికొడుకు కొంచెం తెలివితక్కువ వాడు. తండ్రి తను బ్రతికి ఉండగానే ఆస్తి పంపకాలు చేసేద్దామనుకుని, ముగ్గురికి మూడు పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలు ఏమిటి? ముగ్గురు కొడుకులలో ఎవరు గెలిచారో తెలుసుకోవాలంటే ఈ కథ చదవాల్సిందే. ఈ కథలకు ఎం. మిన్జ్ గీసిన బొమ్మలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. రంగుల మిశ్రమం ఆకట్టుకుంటుంది.
రెండవ కథ ఓ ఎలుక కథ. ఎలుక తన శత్రువులకు భయపండా ఉండేందుకు, ఓ ముని సాయంతో ఆయా జంతువులుగా మారిపోతుంది. కానీ అది దాని భయాన్ని పోగొట్టుకోలేకపోతుంది. చివరికి ఆ ముని దాన్ని మళ్లీ ఎలుకగా మార్చేస్తాడు. ఈ కథకు నటాలియా సుస్తోవా గీసిన బొమ్మలు పిల్లలనే కాకుండా పెద్దలను సైతం ఆకట్టుకుంటాయి.
ఈ కథలు ప్రతి వ్యక్తిలో దాగి ఉన్న చిన్న పిల్లలను వెలికి తీస్తాయి. తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు కూడా ఇవి చదివి వారి బాల్యంలోకి వెళ్ళిన అనుభూతి పొందుతారు.